||సుందరకాండ. ||

||తత్త్వదీపిక-ఏబదియవ సర్గ||

||"'దూతోహమితి విజ్ఞేయో !"!||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ పంచాశస్సర్గః||

తత్వదీపిక
ఏబదియవ సర్గ
'దూతోహమితి విజ్ఞేయో'

"దూతోహమితి" అంటే నేను దూతను అని,
"విజ్ఞేయో" అంటే తెలిసికొనుము అని.
ఎవరి దూత ?
'రాఘవస్య అమిత తేజశః'.
'అమిత తేజోమయుడైన రాముని దూతను'.
ఇది హనుమంతుని మాట.

రావణుని కలిసివెళ్ళుదాము అని నిశ్చయించుకొనిన హనుమ ,
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి లొంగి,
రాజసభకు చేరి, రావణునికి రాఘవుని దూతను అంటూ
తన స్వరూపము వివరిస్తాడన్నమాట.
అదే ఈ సర్గలో జరిగిన కథ.
అదే ఇక్కడ వింటాము.

లోకకంటకుడు అయిన ఆ రావణుడు,
ముందు నుంచుని ఉన్నమహబాహువులుకల ఆ వానరుని
మహత్తరమైన కోపము తో చూస్తాడు.

అలా చూచినప్పుడు ఆ వానరేంద్రుని తేజస్సుతో
రావణుని మనస్సులో శంకలు రేకెత్తుతాయి.
ఏమిటి అవి?

"పూర్వము కైలాసమును కదిలించినపుడు ఎవరిచేత శపింపబడితినో,
ఆ భగవాన్ నంది సాక్షాత్తు ఇక్కడికి వచ్చెనా?
లేక ఇతడు వానరరూపములో వచ్చిన బాణాసురుడా ఏమి?"అని.

ఇవి రావణుని మనస్సులో ఉన్న శంకలు.
దేవతలను ఓడించినట్లు ఎన్ని ప్రగల్భాలు పలికినా
తనపై విజయము సాధించే వారెక్కడో ఉన్నారేమో అని భయము మనస్సులో ఉంటుంది.

కాని రాజుగా తన శంకలు అందరికి తెలియకూడదు.
అందుకని మళ్ళీ సద్దుకొని
క్రోధముతో నిండిన కళ్ళు కలవాడై
మంత్రిసత్తముడు అగు ప్రహస్తునితో
కాలానుగుణముగా అర్థవంతముగా రావణుడు ఈ వచనములను పలికెను.

' ఈ దురాత్ముని అడుగుడు.
ఎక్కడి నుంచి వచ్చెను?
ఏ కారణము వలన వనము భంగపరచెను?
ఏ కారణము వలన రాక్షస్త్రీలను భయపెట్టెను?
దానికి అర్థమేమి?
దుర్భేధ్యమైన నా నగరమునకు రావడములో ఇతని ప్రయోజనమేమి?
యుద్ధము చేసి బీభత్సము చేయుట ఎందుకు?'

రావణుని మాటలను విని ప్రహస్తుడు ఇట్లు పలికెను.

' ఓ వానరా ! నీకు క్షేమము అగుగాక.
భయపడవలదు.
నీకు ఆశ్వాసమివ్వబడినది.
ఓ వానరా నీవు ఇంద్రుని చేత ఈ రావణాలయమునకు పంపబడినచో అది చెప్పుము.
భయపడకుము.
నీవు బంధము నుంచి మోక్షము పోందెదవు.

ఈ చారుని రూపములో ఈ నగరమును ప్రవేశించిన నీవు
కుబేరుని లేక యముని లేక వరుణుని దూతవా ?
లేక విజయముకోరి విష్ణువు చేత పంపబడిన దూతవా?

నీవు రూపమునకు మాత్రము వానరుడవు.
నీకు గల తేజస్సుతో నీవు వానరుడవు కావు.
రావణాలయములో నీ ప్రవేశము ఎందుకొరకు?'
ఇప్పుడు నీ నిజము చెప్పుము.
అప్పుడు బంధవిముక్తుడవు కాగలవు.
నీవు అబద్ధము చెప్పినచో జీవించుట దుర్లభము.

ఈ విధముగా అడగబడిన ఆ వానరోత్తముడు అగు హనుమంతుడు,
ఆ రాక్షసగణముల అధిపతికి ఇట్లు చెప్పెను.

" నేను ఇంద్రుని యముని వరుణుని వాడను కాను.
నేను కుబేరుని సఖ్యుడను కాను.
విష్ణువుచేత పంపబడిన వాడను కాను.

నేను జాతి రూపముగా వానరుడనే.
నేను రాజ కార్యముతో ఇక్కడికి వచ్చినవాడను.
వానరుడను.
రాక్షసేంద్రుని దర్శనము దుర్లభము.
రాక్షస రాజు యొక్క దర్శనార్థము అశోక వనమును నాశనము చేసితిని.

అప్పుడు బలవంతులైన రాక్షసులు యుద్ధకాంక్షతో నాతో తలపడిరి.
దేహరక్షణార్థము నేను యుద్ధము చేసితిని.
నన్ను దేవాసురల అస్త్రములతో బంధింప శక్యము కాదు.
ఇది బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరము.
రాక్షస రాజుని చూచు కోరికతో నేను బ్రహ్మాస్త్రమునకు లొంగిపోతిని.
రాక్షసులచే బంధింపబడి ఆ అస్త్ర ప్రభావము తొలగి పోయినది.
ప్రభో, ఓక ముఖ్య రాజకార్యముతో నీ దర్శనము సంపాదించితిని'.

' నేను అమిత తేజస్సు కల రాఘవుని దూతగా తెలిసి కొనుము.
ఓ ప్రభో, నేను చెప్పే హితవచనములను వినుము.'

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఏభయ్యవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||